అమ్రోహా: ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో శుక్రవారం 28 మంది పిల్లలతో వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ వ్యాన్పై ముసుగు ధరించిన వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి విద్యార్థులను తీసుకెళ్తున్న వ్యాన్పై గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించిన వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటన గజ్రౌలా పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వ్యాన్ డ్రైవరే టార్గెట్ గా భావిస్తున్నారని, అతను, స్కూల్ పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారని సర్కిల్ ఆఫీసర్ శ్వేతాబ్ భాస్కర్ తెలిపారు.
ముగ్గురు అనుమానితులపై గజ్రౌలా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది, వారిలో ఒకరిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దాడి చేసినవారు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో భయపడిన పాఠశాల విద్యార్థులు తమ సీట్ల క్రింద దాక్కుని సహాయం కోసం కేకలు వేశారు.
వెంటనే స్పందించిన డ్రైవర్ పాఠశాల యాజమాన్యానికి సమాచారం అందించడానికి ముందు వాహనాన్ని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లాడు, ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని భాస్కర్ తెలిపారు.